జగన్ శునకానందం పొందుతున్నారు: నక్కా ఆనందబాబు

  • తండ్రిని అడ్డు పెట్టుకుని జగన్ వేల కోట్లు కొల్లగొట్టారన్న ఆనందబాబు
  • స్కిల్ డెవలప్ మెంట్ లో కుంభకోణం జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబును మంత్రులు, ఎమ్మెల్యేల చేత తిట్టిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. తండ్రి వైఎస్సార్ ను అడ్డం పెట్టుకుని వేల కోట్లను కొల్లగొట్టిన చరిత్ర జగన్ దని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపిన వ్యక్తి జగన్ అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి అవకతవకలు జరగకపోయినా... కుంభకోణం జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేయించిట్టు ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో లోకేశ్ పై కేసు పెట్టి... ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... వచ్చే ఎన్నికల్లో ఆయనకు మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ కు బుద్ధి చెప్పే సమయం కోసం జనాలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

Nakka Anand Babu
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News